రెండు హెలీకాప్టర్లు "ఢీ" 13 మంది మృతి

సాహెల్‌ : నవంబరు 26 : రెండు సైనిక హెలికాప్టర్‌లు గగనతలంలో ఒకదానికొకొటి ఢీకొనడంతో ఫ్రాన్స్‌ దేశానికి చెందిన 13 మంది సైనికులు మరణించారు. ఈ విషాద ఘటన మాలీ దేశంలోని సాహెల్‌లో చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం మాలీలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ దుర్ఘటన జరిగింది.ఇదే విషయాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడు ఇమాన్యూయేల్‌ మక్రాన్‌ చనిపోయిన సైనికుల కుటుంబలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు ఆర్మీ అధికారులతో పాటు మరో ఏడుగురు నాన్‌ కమీషన్డ్‌ అధికారులు ఉన్నట్లు తేలింది.1983లో బీరుట్‌ బ్యారక్స్‌ బాంబు దాడిలో 58 మంది ఫ్రెంచ్‌ పారాట్రూపర్స్‌ మరణం తర్వాత ఇప్పుడు 13మంది ఫ్రెంచ్‌ అధికారులను పోగొట్టుకోవడం బాధాకరమని ఫ్రాన్స్‌ రక్షణ విభాగం పేర్కొంది. అయితే దుర్ఘటనకు సంబంధించిన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇస్లామిక్‌ మిలిటెంట్లు మాలీలోని ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించడంతో 2013లో ఫ్రాన్స్‌ ప్రభుత్వం తన బలగాలను అక్కడ మోహరించింది.ప్రస్తుతం సుమారు 4500 ప్రాన్స్‌ బలగాలు మాలీ దేశ సైన్యానికి సహకరిస్తున్నాయి.